UPSC: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు సంచలన ర్యాంకులు సాధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన ఉమా హారతికి మూడో ర్యాంకు వచ్చింది. ఆమె స్పూర్తి గాధ అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన మీడియాలోనూ వైరల్ అయ్యింది. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన దివ్యాంగుడు సివిల్స్లో ర్యాంకు సాధించి భళా అనిపించాడు. వైకల్యాన్ని జయించి కలను సాకారం చేసుకోవడంపై దేశ వ్యాప్తంగా పలువురు ఆయనను అభినందిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన సూరజ్ తివారీ.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. లక్ష్యసాధనకు వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, కుడి చేయి పూర్తిగా విరిగిపోయాయి. ఉన్న ఒక్క ఎడమ చేయికి రెండు వేళ్లు తొలగించినా సూరజ్ తివారీ అధైర్యపడలేదు. పట్టుదలతో చదవే లక్ష్యంగా ముందుకు సాగాడు. రెండో ప్రయత్నంలో 917వ ర్యాంక్ సాధించి అబ్బురపరిచాడు. సివిల్స్ రాయాలనుకొనే చాలా మందికి స్పూర్తిగా నిలిచాడు.
2017లో ఘజియాబాద్లోని దాద్రీ వద్ద రైలు ప్రమాదం జరిగింది. సూరజ్ తివారీ రెండు కాళ్లతో పాటు కుడి చేయి, ఎడమ చేతి రెండు వేళ్లను పోగొట్టుకున్నాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే ఏడాది ప్రారంభంలో తివారీ సోదరుడు రాహుల్ చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం మరింత కుంగుబాటుకు గురైంది. చివరకు జవహరల్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తన డిగ్రీని కూడా ఆపేశాడు. ఆరు నెలల తర్వాత తనను తాను దృఢంగా చేసుకొని మళ్లీ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఈ సారి బీఏలో చేరారు.
2020లో అదే సబ్జెక్టులో మాస్టర్స్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కరోనా సమయంలో యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం మొదలు పెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే రాత పరీక్షలో పాస్ అయ్యాడు. కానీ ఇంటర్వ్యూలో తప్పింది. ఇప్పుడు రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించి ఉద్యోగాన్ని సంపాదించాడు. సూరత్ తండ్రి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అతని తల్లి గృహిణి. పట్టుదలతో చదవడం వల్లే విజయం సాధించానంటూ సూరజ్ పేర్కొన్నాడు. రోజూ ఏకాగ్రతతో చదవడం వల్ల విజయం సాధించవచ్చని తెలిపాడు.
Read also : IAS Success Story: ఆ అలవాట్లే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయి..