Thursday, May 9, 2024
Homeandhra pradeshAndhra Pradesh: యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ.. టీ అమ్ముతూ నోట్లు మార్చాడు!

Andhra Pradesh: యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ.. టీ అమ్ముతూ నోట్లు మార్చాడు!

Telugu Flash News

Andhra Pradesh: సినిమాలను చూసి నేరాలు ఎలా చేయాలో ప్రస్తుతం చాలా మంది నేర్చుకుంటున్నారు. అంతేనా.. యూట్యూబ్‌ వీడియోల్లో చూసి నేరాలు ఎలా చేయాలో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అనేక కేసులు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇవి తగ్గడం లేదు.

ఈజీ మనీకి అలవాటు పడుతున్న కొందరు నేరగాళ్లు ఇదే వృత్తిని ఎంచుకుంటున్నారు. సమాజంలో అమాయకులపై పడి దోచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో నకిలీ నోట్లు ముద్రించే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు చదివింది కేవలం ఏడో తరగతి మాత్రమే. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. ఇదంతా బయటకు మాత్రమే. లోపల మాత్రం అతడిలోని నేరప్రవృత్తి దాగి ఉంది. ఎవరికీ తెలియకుండా ఇంట్లో రహస్యంగా దొంగ నోట్లు ప్రింట్‌ చేస్తుండేవాడు. వాటిని సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం అతడిలో ఉన్న రెండో కోణం. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్‌ (41) సెవెన్త్‌ క్లాస్‌ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేశాడు. ప్రస్తుతం సంతలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి టీ అమ్ముతుండేవాడు. వ్యసనాలకు బానిస అయిపోయిన గోపాల్‌.. ఈజీగా మనీ సంపాదించడం ఎలా అనే విషయమై యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో దొంగ నోట్లను ఎలా ముద్రించాలో వీడియోల్లో చూసి నేర్చుకున్నాడు. తర్వాత బెంగళూరు వెళ్లి కలర్‌ ప్రింటర్‌ తెచ్చుకున్నాడు.

ప్రింటర్‌తో పాటు మందంగా ఉండే ఖాళీ బాండ్‌ పేపర్లు, కలర్లు, గ్రీన్‌ కలర్‌ నెయిల్‌ పాలీష్‌ తీసుకొని వచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ప్రింట్‌ చేయడం మొదలు పెట్టాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్‌ కోసం గ్రీన్‌ నెయిల్‌ పాలిష్‌ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి అయ్యేలా చూసుకుంటున్నాడు.

రెండు రోజుల క్రితం కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. నోటు తీసుకున్న వ్యక్తికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే చేరుకొని గోపాల్‌ను అరెస్ట్‌ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను స్వాధీనం చేసుకున్నారు.

-Advertisement-

Read Also : Telangana: దోస్త్‌తో పని లేదు.. 60కి పైగా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించిన హైకోర్టు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News